కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగమంతా సమాయాత్తం కావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదర రాజా నర్సింహ, ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదర రాజా నర్సింహ, ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజా పాలనపై బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సముదాయ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ప్రజా పాలన, ఆరు గ్యారెంటీల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఆరు గ్యారెంటీల అమలులో చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందని, వాటిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు, దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రతీ ప్రాంతానికి సంబంధిత శాఖల అధికారులు వెళ్లి ప్రజలకు ఇబ్బంది కలగకుండా దరఖాస్తులు తీసుకోవాలని దిశానిర్ధేశం చేశారు. అనంతరం మంత్రి దామోదర రాజానర్సింహ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల రూపకల్పన, విధివిధానాలను ప్రభుత్వం రూపొందిస్తే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత అధికారులపై ఉంటుందన్నారు. అంతిమ లబ్ధిదారులు ప్రజలేనని అర్హులైన వారికి ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే సార్థకత చేకూరుతుందన్నారు. అందులో భాగంగానే కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ఆరు గ్యారంటీల అమలుకు ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించిందన్నారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ యావత్ తెలంగాణ ప్రజలు సంగటితమై కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆరు గ్యారంటీల అమలుకోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన కారక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగా ప్రతీ ఇంటికి వెళ్లి దరఖాస్తు తీసుకోవాలని సోషల్ మీడియా, మీడియా, సినిమా థియేటర్లలో ప్రదర్శన, చాటింపు ద్వారా ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలని పోలీస్ యంత్రాంగం కూడా ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాలోని కొంతమంది అధికారులు తమ పనితీరును మార్చుకోవాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా విధులు నిర్వర్తించాలని, నిర్లక్ష్య ధోరణిని వీడాలని మంత్రి జూపల్లి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
చివరి లబ్దిదారునికి సంక్షేమ ఫలాలు అందించాలనే సంకల్పమే ప్రజా పాలన ఉద్దేశం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చివరి లబ్దిదారునికి సంక్షేమ ఫలాలు అందించాలనే సంకల్పమే ప్రజా పాలన ఉద్దేశం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా పరిదిలో ప్రజా పాలన నిర్వాహణ ఏర్పాట్లపై మంత్రులు దామోదర రాజనర్సింహ జూపల్లి కృష్ణారావు తో మరియు ఉమ్మడి పార్లమెంటు సభ్యులు, జిల్లా శాసనసభ్యులు తో కలిసి సమీక్ష లో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా అసలైన లబ్దిదారునికి సంక్షేమం అందించేందుకు ప్రజాప్రతినిధుల తో కలిసి పనిచేయాలని అధికారులకు ఆయన సూచించారు. అలాగే ప్రజా పాలన కు సంబంధించి అధికారులు నిరంతర ప్రక్రియ అని అంటున్నారు, దానివల్ల లబ్దిదారులకు సరియైన న్యాయం జరుగదు అని, ఒక నిర్దిష్టమైన సమయంలో ప్రజా పాలన అప్లికేషన్లు తీసుకుంటే లబ్దిదారులకు మేలు జరుగుతుంది అని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలను తప్పకుండా అమలు చేస్తుంది అని ఎమ్మెల్యే ప్రకటించారు. ప్రజా పాలన లో స్వీకరించే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్క లబ్దిదారునికి సహకరించాలనీ ఆయన కోరారు. గత ప్రభుత్వం రేషన్ కార్డుల విషయం లో నిర్లక్ష్యం వహించింది అని, కొత్తవి రేషన్ కార్డులు జారీ చేయలేదని వారు తెలిపారు. బాధతో ప్రజలు మన దగ్గరికి వస్తారని వారి సమస్యలను గుర్తించి అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కు చెందిన పార్లమెంటు సభ్యులు పి. రాములు, మన్నె శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ లు స్వర్ణాసుదాకర్ రెడ్డి, వనజ, సరిత, లోక్ నాథ్ రెడ్డి, ఎమ్యెల్సి కూచుకుల్ల దామోదర రెడ్డి, ఎమ్మెల్యేలు చిట్టెం పర్నికా రెడ్డి, అనిరుధ్ రెడ్డి , జి.మధుసూధన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, మేఘా రెడ్డి, విజయుడు, బండా కృష్ణ మోహన రెడ్డి, ఇ.శంకర్ వంశీకృష్ణ, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎస్పిలు అధికారులు తదితరులు పాల్గొన్నారు
Admin
Kalam Power News