కలం పవర్ న్యూస్ - రాజకీయం / మహబూబ్ నగర్ : మహబూబ్నగర్, మార్చి 12 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది – “రాజేందర్ రెడ్డి ఓటమికి నిజంగా ప్రత్యర్థులే కారణమా… లేక పార్టీ లోపలివాళ్లేనా?” ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ అంతర్గత రాజకీయాలను బహిర్గతం చేస్తున్నాయి. తాను పోటీ చేసిన 21వ డివిజన్లో ఓటమికి కొంతమంది కాంగ్రెస్ నాయకులే కారణమయ్యారని ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల్లో ఓటమి కొత్త విషయం కాదు. కానీ ఓటమి తర్వాత ప్రత్యర్థులపై కాకుండా తమ పార్టీలోని నాయకులపై వేలెత్తి చూపడం అంటే పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో అర్థమవుతోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై కూడా అసంతృప్తి ఉందని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాటలు కాంగ్రెస్లోని అంతర్గత విభేదాలకు అద్దం పడుతున్నాయి. రాజేందర్ రెడ్డి ఇప్పటికే కొంతమంది నాయకులపై అధిష్టానానికి ఫిర్యాదు చేశానని, వారిపై చర్యలు తీసుకుంటారనే నమ్మకం ఉందని పలు మీడియా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. అయితే చర్యలు తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదో కూడా స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేయడం పార్టీ లోపలి అసంతృప్తిని మరింత బహిర్గతం చేసింది. ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీతో పోరాడాల్సిన కాంగ్రెస్ నాయకులు… ఒకరితో ఒకరు పోరాడుతుంటే గెలుపు ఎలా వస్తుంది? అనే సందేహలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీని బలపరచాల్సిన నాయకులు అంతర్గత రాజకీయాల్లో బిజీగా ఉంటే కార్యకర్తలు ఎవరిని నమ్మాలి? ఎన్నికల సమయంలో ఒకే జెండా కింద నిలబడ్డ నాయకులు, ఎన్నికల తర్వాత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సాధారణ కార్యకర్తల్లో కూడా సందేహాలను పెంచుతోంది. జిల్లా కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు రాజేందర్ రెడ్డి వ్యవహారంపై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. కానీ అసలు ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది – ఓటమికి బాధ్యులు ఎవరు.? కుట్ర చేసినవాళ్లు ఎవరు.? ఆపోజిట్ కాండిడేట్ కు పది లక్షలు పంపిన కాంగ్రెస్ నేత ఎవరూ.. ఇప్పుడు లేవనెత్తుతున్న ప్రశ్నలు విమర్శలలో వాస్తవం ఎంత..? లేక ఇది కేవలం రాజకీయ ఆరోపణలేనా? ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలంటే పార్టీ లోపలి విభేదాలను పరిష్కరించకుండా “కాంగ్రెస్ కుటుంబం” అనే మాటలు చెప్పడం సులభం… కానీ ఆ కుటుంబంలో ఐక్యత నిలబెట్టడం అంత సులభం కాదు. రాజేందర్ రెడ్డి ఫిర్యాదుపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే ఈ వ్యవహారం ఇప్పుడు "ఒక వ్యక్తి ఓటమి కథ కాదు… మహబూబ్నగర్ కాంగ్రెస్లో ఉన్న అంతర్గత రాజకీయాల అసలు ముఖచిత్రం"గా మారుతోంది.
Admin
Kalam Power News