కలం పవర్ న్యూస్ - రాజకీయం / మహబూబ్ నగర్ : మహబూబ్నగర్, ఏప్రిల్ 1 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) “నిజం రాస్తే నిప్పు అంటుకుంటుందా.? మంటపుడుతుందా” అన్నట్టు పాలమూరులో జర్నలిస్టుల పరిస్థితి మారింది. ప్రశ్నించే కలం కనిపిస్తే చాలు… దానిని వంచాలని, భయపెట్టాలని ప్రయత్నించే కొత్త సంస్కృతి తలెత్తుతోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులపై పెరుగుతున్న బెదిరింపులు, నిఘా చర్యలు కలకలం రేపుతున్నాయి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన పత్రికా స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై ‘గ్యారేజ్ సభ్యులం’ అంటూ చెప్పుకునే కొందరు వ్యక్తులు జర్నలిస్టులపై నిఘా, వేట, బెదిరింపులతో గూండాయిజాన్ని ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. :: నిఘా నీడలో కలం యోధులు...వార్త రాస్తే వేట…! :: ప్రభుత్వంపై విమర్శాత్మక కథనాలు రాసిన జర్నలిస్టుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ, వారి కుటుంబ వివరాలు సేకరిస్తూ, కదలికలపై నిఘా పెట్టడం ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్గా మారిందని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైక్లపై గుంపులుగా తిరుగుతూ “వాడు మహబూబ్ నగర్ లో ఎలా ఉంటాడో చూస్తాం” అంటూ హెచ్చరికలు జారీ చేయడం—ఇది ప్రజాస్వామ్య దేశంలో జరుగుతుందా లేక సినిమాల సన్నివేశమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వ్యక్తులు జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణాలపై ఫోటోలు తీసి, బినామీ పేర్లతో కలెక్టర్ కు ఫిర్యాదులు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఈ కక్ష పూరిత పరిణామాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ⚖️ జర్నలిజం తాకట్టు? ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రచురితమైన "ప్రెస్ క్లబ్ కు తాళం వేయిస్తా అనే కార్టూన్" నేపథ్యంలో ఒక రిపోర్టర్ను లక్ష్యంగా చేసుకుని వేట ప్రారంభించారన్న వార్తలు జర్నలిస్టు వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అదికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు జర్నలిజాన్ని ఒత్తిడులకు లోనుచేసే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి చర్యలకు కొందరు "ప్రజాప్రతినిధుల" మద్దతు కుడా ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జర్నలిస్టులపై జరుగుతున్న పరిణామాలపై సంబంధిత అధికారులు మౌనం పాటించడం ప్రశ్నార్థకంగా మారింది. ???? జర్నలిస్టుల హెచ్చరిక జర్నలిస్టులపై జరుగుతున్న బెదిరింపులు, నిఘా చర్యలను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్వేచ్ఛాయుతమైన పాలనలో ఇలాంటి చర్యలకు తావుండకూడదని స్పష్టం చేస్తున్నాయి. జర్నలిస్టుల భద్రతకు భరోసా కల్పించకపోతే, రానున్న రోజుల్లో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత అందరిదని గుర్తుచేస్తున్నారు.
Admin
Kalam Power News