కలం పవర్ న్యూస్ - సోషియల్ మీడియా వైరల్ / మహబూబ్ నగర్ : మహబూబ్నగర్, మార్చి 14 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల అక్రమ వినియోగంపై సివిల్ సప్లై అధికారులు ఒక్కసారిగా దాడులు ముమ్మరం చేయడం చర్చనీయాంశంగా మారింది. హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ ల లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్గా వాడుతున్నట్లు గుర్తించి సీజ్ చేస్తున్నట్టు అధికారులు గొప్పగా ప్రకటిస్తున్నారు. అయితే ప్రజల్లో మాత్రం ఒకే ప్రశ్న వినిపిస్తోంది. “ఇన్నాళ్లు ఇవి అధికారులకు కనిపించలేదా.?” వీరి కళ్ళల్లో మాముళ్ళ పొరలు కమ్ముకున్నాయిలే.. అని చలోక్తులు విసురుతూన్నారు.నెలలు, సంవత్సరాలుగా హోటళ్ల కిచెన్లలో డొమెస్టిక్ సిలిండర్లు “పర్మనెంట్ ఉద్యోగం” చేస్తున్నాయి. కానీ ఇప్పుడే ఒక్కసారిగా దాడులు జరుగుతుండటంతో ప్రజలు వ్యంగ్యంగా పలుకుతున్నారు. “రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా” అన్నట్లుగా ఇప్పుడు ఆగమేఘాల మీద దాడులు మొదలయ్యాయి కానీ ఇన్నాళ్లు మాత్రం ఈ అక్రమాలు ఎవరికీ కనిపించలేదా.? అనే సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. “నెల నెల వచ్చే మమూల్ల మత్తులో అధికారులు జోగుతున్నారా… లేక అకస్మాత్తుగా నిజాయితీ మేల్కొన్నదా..?” అని ప్రశ్నిస్తున్నారు. డొమెస్టిక్ గ్యాస్ ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం సబ్సిడీతో ఇస్తుండగా, అదే సిలిండర్లు హోటళ్ల వంటగదుల్లో వాడటం వల్ల సాధారణ వినియోగదారులకు నష్టం జరుగుతుందని ప్రజలు చెబుతున్నారు. అక్రమ వినియోగంపై అధికారులు నిజంగా కఠిన చర్యలు తీసుకుంటే ప్రజలు స్వాగతిస్తామని, కానీ కేవలం ఫోటోలకు పరిమితమైన దాడులు కాకుండా నిరంతర తనిఖీలు జరగాలని కోరుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న దాడులను చూసి “మమూల్లు ఆగితేనే తనిఖీలు మొదలవుతాయా?” ప్రజల భద్రత, న్యాయం కోసం ఈ తనిఖీలు కొనసాగుతాయా… లేక "కొన్ని రోజుల తర్వాత మళ్లీ పాత కథ మొదలవుతుందా?" అన్నది వేచి చూడాల్సి ఉంది.
Admin
Kalam Power News