కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : క్రీస్తు బోధనలు విశ్వశాంతికి సోపానమని టీపీసీసీ ఉపాధ్యక్షులు ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం జిల్లా మీడియాసెల్ కన్వీనర్ సీజే బెనహర్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ముందుగా ఒబేదుల్లా కొత్వాల్ క్రిస్మస్ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ధర్మ గ్రంథాల సారం ఒక్కటేనని అన్నారు. ఏసుక్రీస్తు సందేశాలను ఆచరించిన వారి జీవితాలు సుఖమయంగా గడుస్తాయని అన్నారు. బైబిల్ మానవజీవితానికి ఒక గైడ్ లాంటిదని, సేవాభావానికి అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చే క్రైస్తవ సమాజం ఆదర్శనీయమన్నారు. పరోపకారం, ప్రాణుల పట్ల సేవాభావం కలిగి ఉండడాన్ని అలవర్చుకోవాలని సూచించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ శాంతి దూతగా వచ్చిన ఏసుక్రీస్తు ప్రపంచానికి శాంతిని బోధించినట్లు తెలిపారు. టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ మాట్లాడుతూ క్రీస్తు చూపిన ప్రేమ, అనురాగం యావత్ ప్రపంచానికే ఆదర్శమని అన్నారు. సీనియర్ నాయకుడు ఎన్ పీ వెంకటేష్ మాట్లాడుతూ క్రీస్తు చూపిన మార్గంలో నడుద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షురాలు బెక్కరి అనిత, మీడియా కన్వీనర్ సీజే బెనహర్, నాయకులు అజ్మత్ అలీ, నాగరాజు, ఫహీం, టైటస్ రాజేందర్ , సునీల్, ఖాదర్, చిన్నరాజు, నాగభూషణం, బాబు మియా, కన్నా, సుజన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News