కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్నగర్, మార్చి 5 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) జిల్లా కేంద్రంలో అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవడంలో అర్బన్ ఎంఈఓ లక్ష్మణ్ నాయక్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఆరోపించాయి. సమస్యపై వివరణ కోరేందుకు వెళ్లినప్పటికీ ఎంఈఓ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ కార్యాలయంలో ఖాళీగా ఉన్న కుర్చీకి వినతిపత్రం అందజేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో అనుమతులు లేకుండా అనేక ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్నప్పటికీ వాటిపై ఎంఈఓ కార్యాలయం ఎలాంటి తనిఖీలు నిర్వహించకపోవడం అనుమానాలకు తావిస్తున్నదని వారు ఆరోపించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సి.రాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భరత్, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి సీతారాం, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో అనుమతుల్లేని పాఠశాలలు కొనసాగుతున్నా ఎంఈఓ విచారణ చేపట్టడంలో విఫలమయ్యారని విమర్శించారు. వెంటనే ఇటువంటి పాఠశాలలపై సమగ్ర తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్, పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు మారుతి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, హేమలత తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News