కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : యువతను పెడదారిన పడేస్తు ప్రజలకు హాని కలిగించి ప్రాణాలు హరించే మాదకద్రవ్యాలను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్సై అన్నేమొని నాగరాజు అన్నారు. బుధ వారం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. జూనియర్ కళాశాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ బారిన పడి నూరేళ్ల జీవితాన్ని బలి చేసుకోవద్దని, డ్రగ్స్ బారినపడి చనిపోతే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని గుర్తు చేస్తూ విద్యార్థులు నినాదాలు చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు జరిగే కార్యక్రమాల్లో భాగస్వాములమవుతామని, డ్రగ్స్ బారినపడితే కలిగే పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగే కార్యక్రమాల్లో ముందుంటామని విద్యార్థులచే ఎస్సై నాగరాజు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జూనియర్ సివిల్ కోర్ట్ న్యాయవాదులు, కోర్టుసిబ్బంది, ఎంఈఓ అశోక్ కుమార్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దేవేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, ఎక్సైజ్ శాఖ సిఐ, ఎస్.ఐ, పోలీస్ సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News